ఇంటర్నెట్డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. చమురుశుద్ధి కార్మాగారాలు లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేయడంతో రష్యాలో ఇంధన కొరత నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇందుకు ప్రతిస్పందనగా అర్ధరాత్రి ఉక్రెయిన్పై విరుచుకుపడింది. కొన్నిగంటలపాటు క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. రాజధాని నగరం కీవ్లో భారీ పేలుళ్లు వినిపించడంతో ప్రజలు వణికిపోయారు. ఈ దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయి.
ఈ దాడిలో రష్యా (Russia) బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు ఉపయోగించింది. దీంతో నిప్రో నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో తీవ్రనష్టం వాటిల్లింది. ఆ దాడుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించడంతో.. పలువురు మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందారు. ఇది భయంకరమైన శత్రుదాడి అని ఉక్రెయిన్ ప్రభుత్వం అభివర్ణించింది.
ఇప్పటి వరకు ఒకరు మరణించారని, 11మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. కొన్నిరోజులుగా ఉక్రెయిన్ ప్రతిరోజూ వందల డ్రోన్లతో విరుచుకుపడటంతో రష్యా ఉక్కిరిబిక్కిరి అయింది. డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలు తయారు చేసే కార్మాగారాలు సహ సైనిక, ఇంధన స్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత మాస్కోలో బ్లాక్ రెయిన్ కురిసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ దాడులతో ఇంధన కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా స్వయంగా అంగీకరించారు. ప్రస్తుతం బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఇంధనాన్ని రేషన్ పద్ధతిలో అందిస్తోంది. ఈ కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి రష్యా పెట్రోల్ (Petrol prices) దిగుమతి చేసుకుంటోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.