
ప్రముఖ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Fire Accident : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్ ప్రాంతంలోని ఓ హోటల్లో బుధవారం తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మిర్జా గాలిబ్ స్ట్రీట్లోని ఓ హోటల్లో అర్ధరాత్రి దాటిన తరువాత రాత్రి 2గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వేగంగా విస్తరించడంతో హోటల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పొగ పీల్చుకోవడంతో పలువురు స్పృహ కోల్పోయి పడిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అగ్నిప్రమాదం ఎలా జరిగింది? హోటల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు




