
పిల్లల్లో హింసాత్మక ఆలోచనలకు అసలు కారణాలేంటో తెలుసా
‘‘పిల్లలకు ఏదైనా మంచి చెబితే వినే రోజులు కావు ఇవి..’’ ‘‘అంతా ఫోన్ల వల్లే, ఇలా తయారవుతున్నారు..’’ ‘‘జల్సాలకు అలవాటు పడ్డారు. అందుకే అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు..’’ ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తనకు సంబంధించి ఇలాంటి మాటలు.. తరచూ వింటున్నాం. ఈ మాటలను బలపరుస్తూ... ఇటీవల తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఓ స్కూల్ ప్రిన్సిపల్ని విద్యార్థులే అతి దారుణంగా చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీచర్ పట్ల ఉండాల్సిన గౌరవం, భక్తి.. స్థానంలో కక్షపూరితమైన ఆలోచన ఎలా వచ్చింది? మైనర్ పిల్లల్లో అంతటి హింసాత్మక ప్రవృత్తి పెరగడానికి కారణం ఏంటని.. నివ్వెరపోయారు. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంగా భావించే మన సంస్కృతిలో ఇలాంటి అమానుష ఘటనలు చోటుచేసుకోవడానికి గల కారణాలు.. మరో సంఘటనకు తావు ఇవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఈ విధంగా సూచిస్తున్నారు.. ‘సాధారణంగా ఈ రోజుల్లో పిల్లల చదువులో ర్యాంకులే చూస్తున్నాం. కానీ, వారి ప్రవర్తన లో వస్తున్న మార్పులను గమనిస్తున్నామా.. అనేది ప్రశ్నించుకోవాలి. నేటి తరాన్ని మార్చేది శిక్ష రూపంలో కాదు.. ప్రేమ, శ్రద్ధ, అవగాహనయే ప్రధానంగా చూపాల్సింది’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు డాక్టర్ జ్యోతిరాజ. ఒకప్పుడు పిల్లల ప్రపంచం చదువు, ఆటలు, స్నేహాలు, కుటుంబంతో గడిపే సమయంతో నిండి ఉండేది. కానీ నేటిరోజులు అరచేతిలో రంగుల ప్రపంచాన్ని చూపే సోషల్ మీడియా, ఖరీదైన వస్తువులపై ఆకర్షణ, ఏదో ఒక దారిలో త్వరగా డబ్బు సంపాదించి ఆనందించాలనే ఆలోచన, వ్యసనాలు.. పిల్లల మెదళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. కష్టపడటం కన్నా తాత్కాలిక ఆనందాన్నిచ్చే వాటిని అందుకోవడంవైపే మొగ్గుచూపుతున్నారు. కారణాలు ఏవైనా కుటుంబంలో ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవడం అనేది ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది. దీనివల్ల పిల్లల ప్రవర్తనల్లో వచ్చే మార్పులను పసిగట్టలేకపోతున్నారు. ఫలితంగా సరిదిద్దలేకపోతున్నారు. ఒక పిల్లవాడు తప్పు చేసినప్పుడు తోటివాళ్లముందు ‘ఈ పిల్లవాడు చెడ్డవాడు’, ‘సరిదిద్దుకోకపోతే పనిష్మెంట్ తప్పదు...’ అనే హెచ్చరికలు సమస్యకు పరిష్కారాన్ని





