
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల మధ్య మరింత లోతైన సహకారం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు రెండో, చివరి రోజు ఆయన ప్రసంగించారు. ప్రపంచ వ్యవహారాలను శక్తి ఆధారంగా నిర్దేశించే విధానం సరికాదంటూ ‘బలవంతుడిదే రాజ్యం అనే తర్కం చెల్లదని, దానిని చాలా కాలం క్రితమే విస్మరించి ఉండాల్సింది’ అని అన్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ, వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ, సాంకేతిక ప్రతిభకు సంబంధించి ఐదు కార్యక్రమాలను జిన్పింగ్ ప్రకటించారు. కృత్రిమ మేధ రంగంలో సహకారాన్ని పెంచేందుకు బ్రిక్స్ ఏఐ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రత్యేక ఏఐ సదస్సులు, శిక్షణ కోర్సులు నిర్వహించాలని సూచించారు. వాణిజ్యం, పెట్టుబడుల రంగంలో బ్రిక్స్ ప్రత్యేక ఆర్థిక మండలి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని చైనా ప్రతిపాదించింది. వచ్చే ఏడాది బ్రిక్స్ సేవల వాణిజ్య ఫోరమ్ను చైనాలో నిర్వహించనున్నట్లు తెలిపింది. డిజిటల్ ఎకోసిస్టమ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా సభ్యదేశాల సమన్వయాన్ని పెంచాలని జిన్పింగ్ సూచించారు. సైన్స్, టెక్నాలజీలో మరింత అభివృద్ధి కోసం బ్రిక్స్ ఇంజినీర్ కల్టివేషన్ అలయన్స్ను ఏర్పాటు చేయాలని జిన్పింగ్ ప్రతిపాదించారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, గ్లోబల్ సౌత్ దేశాలతో ఉన్న సన్నిహిత సంబంధాలను బ్రిక్స్ దేశాలు ఉపయోగించుకుని సరఫరా గొలుసులను పరిరక్షించాలని, సమగ్ర మార్కెట్ను అభివృద్ధి చేయాలని జిన్పింగ్ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సమావేశంలో ప్రసంగించిన జిన్పింగ్.. ‘నియమాలు లేని ప్రపంచం ట్రాఫిక్ లైట్లు లేని కూడలి లాంటిది. అక్కడ గందరగోళం. అస్తవ్యస్త పరిస్థితులు దాదాపు ఖాయంగా ఉంటాయి’ అని అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో చట్టబద్ధ పాలనను సమిష్టిగా కాపాడాలని గ్లోబల్ సౌత్ దేశాలకు జిన్పింగ్ పిలుపునిచ్చారు. సాంకేతికత, అరుదైన ఖనిజాలను ఆయుధాలుగా మార్చడంపై పరోక్షంగా చైనాను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అలాంటి చర్యలు ఉమ్మడి అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తాయని బ్రిక్స్ సదస్సు ముగింపు ప్రసంగంలో పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమక్షంలో చేసిన ఈ వ్యాఖ్యలను కీలక ఖనిజాలు, అరుదైన లోహాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న బీజింగ్కు ఒక సందేశంగా భావిస్తున్నారు. ‘సాంకేతికతను, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం మన ఉమ్మడి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో మేం సమ్మిళితత్వానికి ప్రాధాన్యతనిచ్చాము’ అని బ్రిక్స్ సమావేశంలో మోదీ పేర్కొన్నారు.





