
ఢిల్లీలో ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ సమావేశం ముగిసింది. ఇక.. కీలక అంశాల పైన కేంద్రం ఫోకస్ చేసింది. అందులో భాగంగా మోదీ 4.0 లక్ష్యంగా కీలక అడుగులు పడుతున్నాయి. కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ.. విపక్షాలు అలర్ట్ అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్రంలోని ముఖ్య నేతలు కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నారు. మరోసారి బిల్లు ప్రవేశ పెట్టటం ఆమోదం కోసం కసరత్తు జరుగుతోంది. ఇందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది.
కేంద్రం మరోసారి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), మహిళా రిజర్వేషన్ల అంశం పైన కీలక మంత్రాంగం సాగిస్తోంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించకపోవడం (ప్రోరోగ్‌ చేయకపోవడం) వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లును ఆమోదం పొందేలా కేంద్రం వ్యూహాలు సిద్దం చేస్తోంది. సంఖ్యా పరంగానూ జాగ్రత్త పడుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఆమ్‌ ఆద్మీ పార్టీ చీలిక ఎంపీలతో పాటుగా డీఎంకే నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. అందులో భాగంగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కు కసరత్తు కొనసాగుతోంది. కేంద్ర కేబినెట్ లో డీఎంకే చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ నెలాఖరు లోగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదం పొందే విధంగా బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
అయితే, డీలిమిటేషన్‌పై ప్రభుత్వానికి ఉన్న ప్రణాళిలను ప్రతిపక్షాలతో పంచుకోవాలని, మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లను పెంచవద్దని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. గత ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ రాక వీగిపోయిన డీలిమిటేషన్‌ బిల్లు, మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లులను మళ్లీ ఇదే నెలలో పార్లమెంట్ ముందుకు తెస్తారనే ప్రచారం జరుగుతోంది. నవరాత్రుల వేళ ఈ బిల్లులను ఆమోదం పొందితే ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందు లో భాగంగా ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు. మంత్రుల పని తీరుపైనా సమీక్షలు చేసిన ప్రధాని.. తన భవిష్యత్ ఆలోచనలను పంచుకుంటున్నారు. కొందరికి పార్టీ బాధ్యతలు.. ముగ్గురికి గవర్నర్ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో.. కేంద్రం అనుకుంటున్న విధంగా ఈ బిల్లులకు ఆమోదం లభిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారుతోంది.






