

Abhishek Sharma : టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో అతడు దీన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్గా రికార్డులకు ఎక్కాడు. భారత్ తరుపున టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
టీ20క్రికెట్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ పేరిట ఉంది. అలెన్ 3386 బంతుల్లో టీ20ల్లో 6 వేల రన్స్ మైలురాయిని చేరుకోగా అభిషేక్ శర్మ 3420 బంతులు తీసుకున్నాడు. వీరిద్దరి తరువాతి స్థానాల్లో ఆండ్రీ రస్సెల్, టిమ్ డేవిడ్ తదితరులు ఉన్నారు.
టీ20ల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు (బంతుల పరంగా) చేసిన ప్లేయర్లు వీరే..
* ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) – 3386 బంతులు
* అభిషేక్ శర్మ (భారత్) – 3420 బంతులు
* ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్) – 3550 బంతులు
* టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా) – 3681 బంతులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (44 బంతుల్లో 64 నాటౌట్) అర్థశతకం బాదాడు. మహ్మద్ నబీ (27 బంతుల్లో 33 పరుగులు) చేశాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత అభిషేక్ శర్మ (82; 32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42 పరుగులు) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో నబీ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ సాధించాడు.





