
హైదరాబాద్‌: 22ఏ భూములపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వ అక్రమాలు బయటపెడతామనే భయంతోనే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారు. సభలో ప్రతిపక్షం లేకుండా, ప్రజా సమస్యలపై చర్చ లేకుండా తప్పించుకుంటున్నారు. 22ఏపై మేం చెప్పింది నిజమని.. ఇవాళ సీఎం ప్రసంగంతో తేలిపోయింది. 3లక్షల ఎకరాల సమస్య.. 30 లక్షల ఎకరాలకు పెరిగిపోయిందని సీఎం అన్నారు. 22ఏ పై గత కొంతకాలంగా బీఆర్ఎస్‌ చేస్తున్న పోరాటం అక్షర సత్యం.. ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయం శాసనసభ సాక్షిగా తేటతెల్లమైంది. కలెక్టర్లు పాత జాబితా అప్‌లోడ్‌ చేశారు.. కలెక్టర్లు చూసుకోకుండా 30లక్షల ఎకరాలను 22ఏలో చేర్చారని సీఎం చెబితే.. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి మాత్రం ఒక్క ఎకరం కూడా చేర్చలేదని అన్నారు. 22ఏ నుంచి సీఎం ఇల్లును రాత్రికి రాత్రి ఎలా తీశారో.. ప్రజల భూములు కూడా అలాగే తీయాలి. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అవమానించారు.. బురదజల్లే ప్రయత్నం చేశారు. 22ఏ తప్పును సరిచేసుకోవాల్సిన పాలకులు విపక్షంపై ఎదురుదాడి చేస్తున్నారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే.. మాపై వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తం వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరాం.. దానిపై సమాధానం లేదు. ఎన్నికల అఫిడవిట్‌లో మేం చూపిన ఆస్తులే.. ఇప్పుడు సీఎం చెప్పారు.భూ భారతిలో రూ.80లక్షల విలువైన చలాన్ల స్కామ్‌ జరిగింది. ఒక్క జిల్లాలో రూ.80లక్షల చలాన్ల స్కామ్‌ జరిగితే .. ఎవరిపైనా చర్యలు లేవు. భూ భారతి ద్వారా ప్రజలకు తెలియకుండానే ప్రజల ఆస్తి.. మరొకరికి బదిలీ అయ్యింది. అసైన్డ్‌ భూములు పట్టా భూములుగా.. పట్టా భూములు అసైన్డ్‌ భూములుగా మారాయి. భూభారతి ద్వారా ఇప్పటికే 9,200కు పైగా అక్రమ లావాదేవీలు జరిగాయి’’ అని హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశం: సీఎం రేవంత్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.