
కేంద్రం స్పందనకు దిల్లీ హైకోర్టు ఆదేశం దిల్లీ: సామాజిక మాధ్యమాలకు బానిసలయ్యేలా చేస్తున్న ఆటోప్లే, ఇన్ఫినిట్‌ స్క్రోల్‌ వంటి కొన్ని ఫీచర్ల నియంత్రణకు ప్రభుత్వం ఏదైనా విధానాన్ని రూపొందిస్తోందా అని దిల్లీ హైకోర్టు బుధవారం కేంద్రాన్ని ప్రశ్నించింది. సోషల్‌ మీడియాని చూడటాన్ని ఒక వ్యసనంలా మార్చేసేలా రూపొందించిన ఫీచర్లను పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) బుధవారం కోర్టు ముందుకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఏం ఉంటోందనేది కాకుండా దానిని చూసేలా ప్రేరేపిస్తున్న నోటిఫికేషన్‌ వ్యవస్థ, లైకులు వంటివాటిపై అభ్యంతరం ఉందని పిటిషనర్, న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌ వికాస్‌ కథూరియా తెలిపారు. 18-24 ఏళ్ల మధ్య వయసున్నవారు రోజుకు 120 నిమిషాల సమయాన్ని సోషల్‌ మీడియా చూడటానికే కేటాయిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎక్కువసేపు ఇలా గడపడం వల్ల ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు, కుంగుబాటు వంటివి కిశోరప్రాయుల్లో కలుగుతున్నాయని చెప్పారు. దీనిపై వాదనల్ని మూడు వారాల తర్వాత వింటామని జస్టిస్‌ నితిన్‌ వాసుదేవ్‌ సాంబ్రే, జస్టిస్‌ అమిత్‌ శర్మల ధర్మాసనం తెలిపింది. ఈలోగా కేంద్రం విధానం ఏమిటో ప్రభుత్వం నుంచి తెలుసుకోవాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మకు సూచించింది. ఇలాంటి అంశాలపై పిటిషన్లను స్వీకరించడానికి సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులు నిరాకరించినందువల్ల పిల్‌ను పరిగణనలో తీసుకోవద్దని కేంద్రం తరఫు న్యాయవాదులు, కొన్ని సోషల్‌ మీడియా సంస్థల న్యాయవాదులు కోరారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





