
ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం పక్కన ఉన్న సర్వే నం.112, 114ల్లోని మూడెకరాల ప్రైవేటు స్థలంలో జోక్యం చేసుకోరాదంటూ కలెక్టర్, టీజీఐఐసీ అధికారులకు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా నానక్‌రామ్‌గూడలో సర్వే నం.112, 114లో చేపట్టిన భూసేకరణ ప్రక్రియను హైకోర్టును రద్దు చేయగా సుప్రీంకోర్టు సమర్థించింది. అయినా రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు భూమి చుట్టూ ఉన్న కంచెను తొలగించడంపై ప్రైవేటు వ్యక్తులు వేర్వేరుగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గత ఆదేశాల అమల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.చంద్రారెడ్డిలతోపాటు ఆన్‌లైన్‌లో టీజీఐఐసీ వైస్‌ఛైర్మన్‌ కె.శశాంకలు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ప్రైవేటు వ్యక్తుల భూమిలో జోక్యం చేసుకోరాదని అధికారులను ఆదేశించింది. భూమి చుట్టూ కంచె వేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




