
జనరల్‌ నాలెడ్జ్‌ చరిత్రలో ఈనాడు సెప్టెంబరు 17 బ్రిటిష్‌ ఇండియాలో అతిపెద్ద సంస్థానంగా వెలుగొందిన హైదరాబాద్‌ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా 13 నెలల పాటు నిజాం పాలనలోనే ఉంది. ఆ సమయంలో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఈ ప్రాంతాన్ని పాలించారు. భారత్‌లో విలీనం కావాలని రాజ్య ప్రజలు కోరుకున్నా పాలకులు ఒప్పుకోలేదు. ‘రజాకార్ల వ్యవస్థ’ వల్ల పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అరాచకాలు ప్రజ్వరిల్లి, మానవ హక్కులు పూర్తిగా నశించాయి. మతతత్వం రాజ్యమేలింది. ప్రజల ప్రాణాలకు రక్షణ కరవైంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో రాజ్యంలో శాంతిస్థాపన కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో పోలీస్‌ చర్య చేపట్టింది. ఫలితంగా 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైంది. పోటీపరీక్షల కోణంలో హైదరాబాద్‌ విలీనానికి సంబంధించి ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..! వింధ్య పర్వతాలకు దక్షిణంగా 82,698 చదరపు మైళ్ల విస్తీర్ణంతో పంచకోణ ఆకృతిలో హైదరాబాద్‌ రాజ్యం ఉండేది. హైదరాబాద్‌ రాజ్యంలో ప్రస్తుత తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. దీన్ని 1724 నుంచి 1948 వరకు అసఫ్‌జాహీ రాజులు పాలించారు. క్రీ.శ.1724లో అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించిన నిజాం-ఉల్‌-ముల్క్‌ మొగల్‌ చక్రవర్తికి సామంతుడిగా పాలించాడు. క్రీ.శ.1797లో భారత గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన వెల్లస్లీ భారతదేశంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. అసఫ్‌జాహీ రెండో పాలకుడైన నిజాం అలీఖాన్‌ ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందంపై 1798లో సంతకం చేశాడు. దీనివల్ల హైదరాబాద్‌ రాజ్యం ఒక ప్రిన్స్‌లీ స్టేట్‌గా మారి 1947 వరకు బ్రిటిషర్ల ఆధిపత్యంలో కొనసాగింది. మొత్తం జనాభాలో 85% హిందువులే. ఆపరేషన్‌ పోలో ముఖ్యాంశాలు, విలీనం తర్వాత హైదరాబాద్, ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ సాకారం తదితర సమాచారంతోపాటు గతంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ - ప్రిలిమ్స్, మెయిన్స్, తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్, తెలంగాణ హైకోర్ట్‌ జూనియర్‌ అసిస్టెంట్, టీజీపీఎస్సీ ఏఈఈ, ఏపీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ప్రిలిమ్స్, ఏపీ హైకోర్ట్‌ అసిస్టెంట్‌ ఎగ్జామినర్, ఏపీ పంచాయత్‌ సెక్రటరీ మొదలైన పరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 65కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు-II’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. మరిన్ని వివరాలకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





