

Ganesh Chaturthi Puja Muhurat : హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా ముందుగా పూజించే దేవుడు ప్రథమ పూజ్యుడు గణనాథుడు. వినాయక చవితి వచ్చిందంటే ఇండ్లలో సందడి మొదలవుతుంది. పల్లెలు, పట్టణాల్లో తొమ్మిదిరోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. ఇవాళ వినాయక చవితి కావడంతో ప్రజలు మండపాలను ఏర్పాటు చేసి గణనాథులను ప్రతిష్టించారు. కొందరు తమ ఇండ్లలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, ఇంట్లో గణపయ్యను ప్రతిష్ట చేసినవారు ఈ నియామాలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
Also Read : Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేటి నుంచి ఈ టోకెన్లు ఇవ్వరు.. మళ్లీ ఎప్పుడు ఇస్తారంటే!
ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించిన వారిలో కొందరు ఒకటిన్నరరోజు , మరికొందరు 3, 5, 7 లేదంటే 10 రోజులపాటు పూజలు నిర్వహించి.. చతుర్దశి రోజున నిమజ్జనంతో ఉత్సవానికి ముగింపు పలుకుతారు. అయితే, ఇండ్లలో వినాయకుడిని ప్రతిష్టించుకునే వారు.. ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఏర్పాటు చేయడం శుభప్రదంగా భావిస్తారు. పూజ చేసేటప్పుడు భక్తులు తూర్పు లేదంటే ఉత్తరంవైపు ముఖంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సంప్రదాయాలు సూచిస్తున్నాయి. అయితే, ఇంటి నిర్మాణం, పూజాస్థలం, కుటుంబ ఆచారాలు ఒక్కో ఇంటికి భిన్నంగా ఉంటాయి. ఈ కారణంగా దిశ విషయంలో స్థానిక ఆచారాన్ని లేదంటే పండితుల సూచనను అనుసరించడం మంచిది.
ఇంట్లో గణపతిని ప్రతిష్టించుకుంటే.. ప్రతీరోజూ పూజలు చేయాలి. నిత్య పూజ, హారతి, నైవేద్యం చేయడం సంప్రదాయం. కొన్ని కుటుంబాల్లో రోజుకు మూడుసార్లు నైవేద్యం సమర్పించే పద్ధతీ ఉంటుంది. గణేశ్ చతుర్థి రోజున షోడశోపచార పూజ నిర్వహించే సంప్రదాయం కూడా ఉంది. ఇందులో సంకల్పం, ఆవాహన, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం తదితర ఉపచారాలు ఉంటాయి.
సాధారణంగా తులసి దళాలను గణపతికి సమర్పించకూడదనే అనే సంప్రదాయం ఉంది. దీనికి పురాణాల్లోని తులసి-గణపతి కథను కారణంగా చెబుతారు. అదే సమయంలో కొన్ని గణేశ్ చతుర్థి ఆచారాల్లో తులసిని మినహాయింపుగా ఉపయోగించే సంప్రదాయ ప్రస్తావనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రాంతీయ, కుటుంబ ఆచారాన్ని అనుసరించడం మంచిది.
సాధారణంగా ఉదయం, సాయంత్రం పూజ చేయాలి. ఉదయం పూజ సమయంలో ఉదయం స్నానం చేసిన తరువాత వినాయకుడికి దీపం, ధూపం (అగరుబత్తీలు) వెలిగించి నైవేద్యం (పండ్లు, బెల్లం లేదా ఏదైనా ప్రసాదం) సమర్పించి ఇవ్వాళి. సాయంత్రం వేళ పూజలో కూడా దీపం, ధూపం వెలిగించి, నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాళి. ఒకవేళ ఉద్యోగం లేదా ఇతర పనుల వల్ల రెండు సార్లు పూజ చేయడం కుదరకపోతే, ఉదయం ఒక్క పూట అయినా ఖచ్చితంగా దీపారాధన చేసి, నైవేద్యం సమర్పించి పూజించడం తప్పనిసరి. మరోవైపు.. పూజ చేసే సమయంలో, నైవేద్యం సమర్పించే సమయంలో శారీరక, మానసిక శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.





