
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ యువకుడి మృతి తీవ్ర కలకలం రేపింది. భార్యతో విబేధాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన బురెడ్డిపల్లికి చెందిన రాజు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. దీంతో అతని మృతదేహాన్ని తీసుకొచ్చి గద్వాలలోని భార్య ఇంటి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బురెడ్డిపల్లికి చెందిన నరేశ్ కొంతకాలంగా గద్వాల పట్టణంలోని రెండో రైల్వేగేట్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. గతంలో నరేశ్, అతడి భార్య రాణి మధ్య కుటుంబపరమైన విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాణి పోలీసులను ఆశ్రయించగా.. ఇరువురి మధ్య వివాదం మరింత ముదిరినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆ సమయంలోనే రాణికి ఓ ఏఆర్ కానిస్టేబుల్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త చనువుగా మారింది. ఏఆర్ కానిస్టేబుల్తో భార్యకు సన్నిహిత సంబంధం ఏర్పడిన విషయం తెలిసిన నరేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రెండుసార్లు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో నరేశ్పైనే ఏఆర్ కానిస్టేబుల్ కేసు పెట్టించాడు. ఈ విబేధాల నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చిన నరేశ్.. అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన శంషాబాద్ సమీపంలో ఆత్మహత్యకు యత్నించాడు. రాణీ.. నీవంటే నాకు ఇష్టం.. నీవు లేని బతుకు వ్యర్థం అంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, తీవ్రంగా గాయపడి కనిపించిన నరేశ్ను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు ఆస్పత్రిలో గత పది రోజులుగా చికిత్స పొందుతున్న నరేశ్ సోమవారం రాత్రి మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని తీసుకుని గద్వాలలోని భార్య ఇంటికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచేందుకు ప్రయత్నించడంపై కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కొందరికి పోలీసులు ఫోన్ చేసి హెచ్చరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించినవిగా చెబుతున్న కొన్ని ఆడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, తనకు జరిగిన పరిణామాలకు పట్టణ ఎస్సై, ఏఆర్ కానిస్టేబుల్ కారణమంటూ నరేశ్ గతంలో ఓ లేఖ రాసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.





