
రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళాకారులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి అవసరమైన నాణ్యమైన కలపను ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అసలు ధరకే అందించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ‘క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల’ ఏర్పాటుపై సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కలప సేకరణ, రవాణా, నిల్వకు అయ్యే వాస్తవ వ్యయాన్ని మాత్రమే వసూలు చేస్తూ చేతివృత్తుల వారికి ముడిసరుకును సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ముడిసరుకు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులకు ఈ వుడ్ బ్యాంకులు ఒక భరోసాగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రక్రియలో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా కళాకారుల ఉత్పత్తి వ్యయం తగ్గి, వారికి ఆర్థిక భరోసా లభిస్తుందని వివరించారు.రాష్ట్రంలోని కొండపల్లి, ఏటికొప్పాక, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి, బొబ్బిలి వంటి ఆరు ప్రధాన కేంద్రాల్లో ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. కొండపల్లి బొమ్మలకు అవసరమైన తెల్లపొనికి, ఏటికొప్పాక హస్తకళలకు వినియోగించే అంకుడు, బొబ్బిలి వీణల తయారీకి వాడే పనస, రోజ్వుడ్ వంటి కలపను ఈ బ్యాంకుల ద్వారా సరఫరా చేస్తారు. అలాగే, రాజమండ్రి సెంట్రల్ వుడ్ బ్యాంకులో వెదురు, టేకు వంటివి అందుబాటులో ఉంటాయి. అరుదైన కలప జాతుల లభ్యతను మ్యాపింగ్ చేసి, వాటిని అటవీ నర్సరీలలో సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులను ఆదేశించారు