
సోషల్ మీడియాలో ఏం చేసినా ఎవరికీ తెలియదనుకున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూస్తూ క్షణికానందం పొందాడు. అంతటితో ఆగకుండా.. ఆ వీడియోల లింకులను ఇతరులకు షేర్ చేస్తూ తనకేమీ కాదన్నట్టుగా వ్యవహరించాడు. కానీ.. డిజిటల్ ప్రపంచంలో వేసిన ప్రతి అడుగు ఓ ఆనవాలే. చివరకు అతడి ఆన్లైన్ కార్యకలాపాలు అంతర్జాతీయ స్థాయి నిఘా సంస్థ దృష్టికి వెళ్లడంతో పోలీసులకు చిక్కాడు. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ (NCMEC) అందించిన సమాచారంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గాజులరామారం ప్రాంతానికి చెందిన శానప్ప అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్నారులకు సంబంధించిన అక్రమ లైంగిక కంటెంట్ను వీక్షించడంతో పాటు, వాటికి సంబంధించిన లింకులను ఇతరులకు షేర్ చేస్తున్నట్లు NCMEC గుర్తించింది. నిందితుడి ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని NCMEC తన టిప్లైన్ ద్వారా భారతీయ అధికారులకు చేరవేసింది. దీంతో రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆన్లైన్ కార్యకలాపాలను విశ్లేషించిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా అతడు వినియోగిస్తున్న ఫోన్ నంబర్ను గుర్తించినట్లు తెలిసింది. ఆ వివరాలను జీడిమెట్ల పోలీసులకు అందించడంతో పోలీసులు శానప్పపై కేసు నమోదు చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు ఎవరెవరికి లింకులు షేర్ చేశాడు..? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా..? అనే కోణాల్లోనూ విచారణ సాగుతున్నది. సోషల్ మీడియాలో తమ కార్యకలాపాలు ఎవరికీ తెలియవని భావించే వారికి.. ఈ ఘటన డిజిటల్ నిఘా ఎంత పకడ్బందీగా ఉందో చెప్పకనే చెబుతోంది. పంద్రాగస్టు వేడుకల వేళ విధ్వంసానికి ఉగ్రకుట్ర.!