
30 రోజులు జైల్లో ఉంటే పదవి పోయే బిల్లులో మార్పులు సూచించిన జేపీసీ ఈనాడు, దిల్లీ: కనీసం ఐదేళ్లు శిక్షపడటానికి అవకాశమున్న తీవ్ర నేరాల్లో అరెస్టయి వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రుల పదవులను ఆటోమేటిక్గా రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కొన్ని సవరణలు సిఫార్సు చేసినట్లు తెలిసింది. జైలుకెళ్లిన వారిని పదవుల నుంచి తొలగించడానికి (రిమూవల్) బదులు పదవుల నుంచి సస్పెండు చేసేలా బిల్లులో పదబంధం మార్చాలని సూచించినట్లు సమాచారం. దిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ వివిధ కేసుల్లో అరెస్టై దీర్ఘ కాలం జైల్లో ఉంటూనే పదవుల్లో కొనసాగిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ అధికరణలు 75, 164, 239ఎఎలకు సవరణలు ప్రతిపాదిస్తూ గత ఏడాది ఆగస్టులో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో జేపీసీ పరిశీలనకు పంపింది. ఒడిశాకు చెందిన భాజపా లోక్సభ సభ్యురాలు, మాజీ ఐఏఎస్ అధికారిణి అపరాజిత సారంగి నేతృత్వంలోని కమిటీ దీనిపై అధ్యయనం చేసి పలు సిఫార్సులతో తుది నివేదిక తయారు చేసింది. ఈ నెల 17న లోక్సభ స్పీకర్కు సమర్పించడానికి సిద్ధమైంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు