
అమరావతి: మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని.. విచారణ జరిపించాలంటూ వైకాపా సభ్యుల ఆందోళనతో శాసనమండలి కార్యకలాపాలకు మూడోరోజు కూడా అంతరాయం కలిగింది. వైకాపా సభ్యుల తీరుపై మంత్రులు పార్థసారధి, నాందెడ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఆర్డర్లో పెట్టాలంటూ మండలి ఛైర్మన్ని మంత్రులు కోరే సందర్భంలో కాసేపు వాడీవేడి చర్చ జరిగింది. మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే... మెగా డీఎస్సీ నిర్వహణపై విచారణ చేయాలంటూ వైకాపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ కె.మోషేను రాజు తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే... సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తూ వైకాపా సభ్యులు నినాదాలు చేశారు. ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి జోక్యం చేసుకుని .. మూడు రోజులుగా సభను జరగనీయటం లేదని.. అడ్డుకునే వారిని సస్పెండ్ చేసి బయటకు పంపించాలని కోరారు. వైకాపా సభ్యులు సభను గౌరవించటం లేదని, ఛైర్మన్ టేబుల్ను కొడుతూ నినాదాలు చేస్తున్నారని...ఆర్డర్లో పెట్టాలని మంత్రి నాదెండ్ల సూచించారు. మనోహర్ వ్యాఖ్యలపై ఛైర్మన్ మోషేను రాజు అసహనం వ్యక్తంచేస్తూ... సభా నిర్వహణ, నిబంధనల గురించి మీకు బాగా తెలుసన్నారు. చర్యలు ఎలా తీసుకోవాలో దాని ప్రకారం ముందుకెళ్లాలన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. గత ప్రభుత్వంలో మీరు ఛైర్మన్ గా ఉన్నప్పుడు రెడ్ లైన్ గీసి.. విపక్షాల వాళ్లు గీత దాటి వస్తే సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అలాగే చేసేందుకు మీకు అధికారాలున్నాయని స్పష్టం చేశారు. మూడు రోజులుగా సభకు అంతరాయం కలిగిస్తుంటే చర్యలు తీసుకోవచ్చన్నారు. వైకాపా సభ్యుల ఆందోళనతో మండలిని వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ మోషేను రాజు ప్రకటించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా