
ఎండాడ, న్యూస్టుడే: నగరంలోని ఓ విశ్రాంతి ఉద్యోగి దంపతులను ‘డిజిటల్ అరెస్టు’ పేరుతో భయపెట్టి సుమారు రూ.1.5 కోట్లు కాజేసిన కేసులో కేరళకు చెందిన కమీషన్ ఏజెంట్ను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... నగరంలో 76 ఏళ్ల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి దంపతులకు సైబర్ నేరగాళ్లు టెలికాం, పోలీస్, ఈడీ, సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేసి అరెస్టు చేస్తామని బెదిరించారు. అనంతరం ఆర్బీఐ ఫండ్ వెరిఫికేషన్ వారిని నమ్మించి జీవితకాల పొదుపు మొత్తం రూ.1,46,50,520లను వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నాడు. ఈ భారీ మోసంపై బాధితుల ఫిర్యాదు మేరకు సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 16న ఐసీఐసీఐ బ్యాంకు చందానగర్ శాఖలోని ఓ ఉమ్మడి ఖాతాకు రూ.29,20,000లు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. కేవైసీ, మొబైల్ నెంబర్ ఆధారంగా ఆ ఖాతాదారుడు కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్కు చెందిన పీఎం షబ్బీర్ (40)ను పోలీసులు పట్టుకుని కోర్డులో హాజరుపరచడంతో అతడికి 15 రోజుల రిమాండు విధించారు. అధిక కమీషన్ ఆశతో తన బ్యాంకు ఖాతా, ఏటీఎం, సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లకు అందించినట్లు విచారణలో అంగీకరించిన షబ్బీర్ తన ఖాతా ద్వారా రూ.92 లక్షల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు