
సిద్దిపేట టౌన్: భారత్- బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది స్వర్ణయుగమని బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు (లైఫ్ పీర్) ఉదయ్ నాగరాజు అన్నారు. రానున్న 30 ఏళ్లలో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను మెరుగుపరిచేవిధంగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజ్.. బ్రిటన్ హౌజ్ ఆఫ్ లార్డ్స్లో శాశ్వత సభ్యుడిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తొలిసారిగా తన స్వగ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో బుధవారం పౌరసమాజం, తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. తాను లండన్లో లార్డ్ అయినప్పటికీ సొంత గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి ఈ మట్టిబిడ్డనే అన్నారు. హరీశ్రావు స్ఫూర్తితో తాను అక్కడి రాజకీయాల్లో రాణిస్తున్నానని చెప్పారు. శనిగరంలో నిర్వహించే బతుకమ్మ పండుగ తనకు ఎంతో ఇష్టమన్నారు. ఉదయ్ నాగరాజు చిన్న గ్రామంలో పుట్టి బ్రిటన్ పార్లమెంటు సభ్యుడిగా ఎదగటం రాష్ట్రానికే గర్వించదగిన విషయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఉదయ్ తెలంగాణలో జన్మించి బ్రిటన్లో ఉదయించాడన్నారు. చిన్నవయసులోనే తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్కు ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ కావటం గర్వించదగిన విషయమన్నారు. అంతేకాకుండా శాశ్వత ఎంపీగా అరుదైన అవకాశం పొందటం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవమన్నారు. ఎంతో కష్టపడి, పట్టుదలతో ఆయన ఈ స్థాయికి వచ్చారన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కోసం పనిచేయాలన్నారు. ఉదయ్ నాగరాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొంది, బ్రిటన్ ప్రజల సంక్షేమం కోసం, అక్కడ స్థిరపడిన భారత సంతతి రక్షణ, అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని హరీశ్రావు ఆకాంక్షించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు