
ఖమ్మం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఒక భారీ బహిరంగ సభలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరైన ఈ వేదిక వద్ద ఇతర పార్టీల నేతల ఫ్లెక్సీలు కనిపించడం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని రైతు సమూహాలతో ముఖాముఖిగా మాట్లాడటానికి, వారి సమస్యలను తెలుసుకోవడానికి పర్యటనకు వచ్చారు. సీఎం సభా వేదిక వద్దకు చేరుకునే సమయంలో, ఆ ప్రాంతంలో జగన్ ఫొటోలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు భారీగా వెలిశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభలో పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం బ్యానర్లు రాజకీయ చర్చకు తెరలేపింది. ఈ సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి పాత బ్యానర్లు కూడా దర్శనమిచ్చాయి. స్థానిక టీడీపీ శ్రేణులు, పాత అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఈ ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకే వేదిక పరిసరాల్లో కాంగ్రెస్ నాయకులతో పాటు వైసీపీ, టీడీపీ బ్యానర్లు కనిపించడం విశేషం. కాగా ఈ బ్యానర్లు.. రాష్ట్రాలకూ, రాజకీయాలకు అతీతంగా పార్టీలు సీఎం రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నాయనడానికి నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఈ పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా మరింత బలోపేతం కావడానికి దోహదం చేస్తుందంటున్నాయి. మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది