
కనీస వసతుల్లేని కూరగాయల విక్రయ కేంద్రాలు రైతులు, కొనుగోలు దారులకు తప్పని ఇబ్బందులు నగరంలోని రైతుబజార్లు అసౌకర్యాలతో కునారిల్లుతున్నాయి. కనీస వసతుల్లేకపోవడంతో ఇటు రైతులు, వ్యాపారులు, అటు కొనుగోలుదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు, తాగునీరు, వాహనాల పార్కింగ్, వ్యర్థాల నిల్వలు ఇలా పలు సమస్యలతో సతమత మవుతున్నారు. చిత్రంలో కనిపిస్తోంది వినియోగదారులతో కిటకిటలాడుతున్న నరసింహనగర్ రైతుబజారు. ఇక్కడ నీటిశుద్ధి పరికరం మరమ్మతులకు గురికావడంతో గత మూడు నెలలుగా తాగునీటి సౌకర్యం లేదు. ఇక్కడ కేవలం 25 వాహనాల వరకు పార్కింగ్ చేసే సదుపాయం మాత్రమే ఉండడంతో పెద్దసంఖ్యలో వాహనాలన్నీ రహదారిపైనే నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్యలతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ స్థలాభావం కారణంగా పలువురు రైతులు నేలపైనే వ్యాపారాలు సాగించాల్సి వస్తోంది. చిత్రంలో కనిపిస్తున్నవి పెందుర్తి రైతుబజారు ఎదుట సగానికిపైగా బీఆర్టీఎస్ రహదారి ఆక్రమించి నిలిపిన ద్విచక్రవాహనాలు. రైతు బజారును విస్తరించే అవకాశం లేకపోవడంతో ఇరుకుగా మారింది. రైతులు సరకు భద్రపరచుకునేందుకు వసతి లేకపోవడంతో నడకమార్గాల్లోనే వదిలేస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. రైతుబజారు బయట నడక మార్గాలను చిరువ్యాపారులు ఆక్రమించడం, పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో కొనుగోలుదారులు రోడ్డుపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. చిత్రంలో కనిపిస్తున్నవి గాజువాక రైతుబజారు ముందు ఇరుకు స్థలంలో నిలుపుదల చేసిన ద్విచక్రవాహనాలు. ఇళ్ల మధ్యలో ఉన్న రైతుబజారును విస్తరించాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమవుతోంది. దీన్ని మల్టీస్టోర్ మార్కెట్గా తీర్చి దిద్దేందుకు గతంలో నిర్ణయించినా స్థలాభావం, వనరుల కొరత, పార్కింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్కు నిత్యం తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇది గోపాలపట్నం రైతుబజారు. దీనికి సమీపంలో ఉన్న అన్నక్యాంటీన్ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను కాలువ ద్వారా రైతుబజారులోకి వదిలేస్తుండటంతో దుర్గంధం వ్యాపిస్తోంది. మరో వైపు బజారులో టన్నులకొద్దీ చెత్త పేరుకుపోతోంది. జీవీఎంసీ కొంతమేర తరలిస్తున్నప్పటికీ మిగిలింది అలాగే వదిలేస్తున్నారు. ఇక్కడ వర్మీకంపోస్టు యూనిట్లు సైతం నిరుపయోగంగా మారాయి. ప్రధాన గేటును తొలగించి మరోచోట నిర్మిస్తామని గతంలో చెప్పినా అమలు