
ఇంటర్నెట్డెస్క్: రష్యా ఆర్థిక జీవనాడి అయిన చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ దాడులు (Ukrainian drone attacks) తీవ్రతరం చేసింది. రష్యాలోని స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాలలోని ఇంధన నిల్వ కేంద్రాలు, చమురు పంపింగ్ స్టేషన్లను తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) ప్రకటించారు. యుద్ధం ముగించడానికి మాస్కో నిరాకరిస్తుండడంతోనే దాడులు తీవ్రం చేసినట్లు వెల్లడించారు. ఈ యుద్ధాన్ని ముగించాలని తాము ఎన్నిసార్లు ప్రతిపాదించినప్పటికీ.. ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదన్నారు. యుద్ధాన్ని ముగించే వరకూ.. ప్రతిరోజు రష్యాలో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటామన్నారు. క్రిమియా సహా దేశంలోని పలు కీలక చమురు కేంద్రాలు (Russian oil facilities), రైల్వే సదుపాయాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి ప్రారంభమైన దాడులు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో పలు ప్రాంతాల్లోని దాదాపు ఆరు చమురు డిపోలు ధ్వంసమైనట్లు తెలిపారు. వాటి నుంచి భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. అజోవ్ సముద్రంలోని రెండు చమురు ట్యాంకర్లపై కూడా డ్రోన్ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా ఉక్రెయిన్ తరచూ భారీ దాడులు చేస్తుండడంతో పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత (Fuel Crisis) చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంధనం కోసం వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సివస్తోందని తెలిపారు. గురువారం తమ రక్షణ దళాలు 73 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు గురువారం రాత్రి రష్యా దళాలు తమ దేశంలోని పలు ప్రాంతాలపై 94 డ్రోన్లు.. రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో 72 డ్రోన్లను అడ్డుకున్నామని పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని