
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మృతిచెందిన ఓ టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె వెళ్తున్న సమయంలో ప్రయాణిస్తున్న వాహనాన్ని నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘చోర్’ అంటూ విమర్శలు చేసినట్లు సమాచారం. అనంతరం ఆమె కారుపై బురద, చెప్పులు, రాళ్లు, ఇటుకలు విసిరినట్లు తెలుస్తోంది. బిర్జూ అనే టీఎంసీ కార్యకర్తను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలోనే అతడు మృతి చెందాడు. తన భర్తను లాకప్లో పోలీసులు కొట్టడం వల్లే మరణించారని బిర్జూ భార్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ అక్కడికి బయలుదేరారు. ఆమె వెంట టీఎంసీ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ కూడా ఉన్నారు. Read Also : Moto G06 Power Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే.. ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. తన కారుపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని, చెప్పులు, బురద కూడా విసిరారని ఆరోపించారు. రాయి తలకు తగిలి ఉంటే తన ప్రాణాలకు ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను వస్తున్న విషయం పోలీసులకు ముందుగానే తెలిసినా తగిన భద్రత కల్పించలేదని ఆరోపించారు. తనను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని, దీని వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. మరోవైపు బీజేపీ మాత్రం మమతా బెనర్జీ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఉద్రిక్తతలను పెంచేందుకే ఆమె అక్కడికి వెళ్లారని విమర్శించింది. ఆమె రాకను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొంది. దీంతో టీఎంసీ కార్యకర్త మృతి వ్యవహారం మరోసారి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది