
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీకి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ధన్యవాదాలు తెలిపారు. ఇండోనేసియాలోని జకార్తాలో మోదీ చేసిన ప్రసంగంలో బాలీవుడ్ పాట ‘కుచ్ కుచ్ హోతా హై’ (Kuch Kuch Hota Hai) ప్రస్తావన తీసుకురావడంపై కరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో గౌరవంగా అనిపించిందని.. ఆ సినిమా టైటిల్ సాంగ్ ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. జకార్తాలో జరిగిన కార్యక్రమంలో మోదీ (Narendra Modi) మాట్లాడుతూ.. ఇండోనేసియాలో భారతీయ సినిమాలకు ఉన్న ప్రజాదరణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా టైటిల్ ట్రాక్ను ఆయన ప్రస్తావించారు. ఆ పాటకు ఇండోనేసియాలోనూ ఆదరణ ఉందన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతూ.. భారత్, ఇండోనేసియా కలిసి ముందుకు సాగినప్పుడు ‘కుచ్ కుచ్’ (కొంచెం కొంచెం) నుంచి ‘బహుత్ కుచ్’ (చాలా ఎక్కువ) సాధించవచ్చు’’ అని ప్రధాని చమత్కరించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్న కరణ్ జోహర్ (Karan Johar).. ప్రధానికి థాంక్స్ చెప్పారు. ‘‘ప్రధాని నోట ఈ పాట రావడం నాకెంతో ఆనందంగా, గౌరవంగా ఉంది. సినిమాలకు భాషతో సంబంధం లేదు. ఈ పాటను ఆదరించినందుకు, రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల విషయంలో దాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు’’ అని పోస్ట్ పెట్టారు. ‘కుచ్ కుచ్ హోతా హై’ చిత్రంతో కరణ్ జోహార్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన తండ్రి యశ్ జోహర్ నిర్మాతగా వ్యవహరించగా, ఇందులో షారుక్, కాజోల్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించారు. 1998లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి