
ఒంగోలు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa reddy)పై కరపత్రాలు ముద్రిస్తే పుస్తకాలు సరిపోవని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ (Damacharla janardhan) అన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించేలా ఆయన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బాలినేని విమర్శల నేపథ్యంలో దామచర్ల స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చారు. ‘‘అమావాస్యకు ఓసారి బాలినేని ఒంగోలు వస్తారు. ఆయన కూటమిలో ఉన్నారని మౌనంగా ఉన్నాం. నాపై బాలినేని అనుచరుడు మురళి కరపత్రాలు వేశారు. ఆయనే కరపత్రాలు వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలినేనిపై కరపత్రాలు ముద్రిస్తే పుస్తకాలు కూడా సరిపోవు. గత ప్రభుత్వంలో మాపై 79 కేసులు పెట్టించారు. బాలినేని పార్టీ మారారు కాబట్టి సరిపోయింది.. లేకుంటే తండ్రీకుమారులను లోపల వేసేవాళ్లం. గత ప్రభుత్వంలో చేసినట్లు రౌడీయిజం చేస్తామంటే కుదరదు. జనసేనను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలకు పనిచేస్తున్నారు. బార్ షాపులు సిండికేట్ చేసి తండ్రీకుమారులు రూ.కోట్లు వసూలు చేశారు. చేసిన అక్రమాలపై ప్రమాణం చేసేందుకు బాలినేని కాణిపాకం వస్తారా? నేను ఎలాంటివాడినో ప్రజలకు తెలుసు కనుకే 34వేల మెజారిటీ ఇచ్చారు. తలకిందులుగా తపస్సు చేసినా బాలినేనికి ఆ మెజారిటీ రాదు. ప్రభుత్వ భూముల్లో ఆయన వియ్యంకుడి విల్లాలున్నాయి. ఆ భూమిని వెంగముక్కలపాలెం ప్రజలకు కమ్యూనిటీ హాల్ కింద ఇస్తాం’’ అని దామచర్ల జనార్దన్ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు