
భారత్లో పెద్దగా పరిచయం లేని సెపక్ టక్రా గేమ్స్లో మన జట్టు మరోసారి సత్తా చాటింది. ఆసియాగ్నేసియా ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన సెపక్ టక్రా గేమ్లో భారత్ తాజాగా కాంస్య పతకం సాధించింది. థాయ్లాండ్ వేదికగా జరిగిన కింగ్స్ కప్ సెపక్ టక్రా చాంపియన్షిప్లో పురుషుల క్వాడ్రాంట్ (నలుగురు ఆటగాళ్లు కలిసి) ఈవెంట్లో భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో భాగంగా సెమీఫైనల్లో భారత్ 15-9, 9-15, 9-15తో ఆతిథ్య థాయ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆద్యంతం థ్రిల్లింగ్గా సాగిన పోరులో భారత ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడం విశేషం. ఈ విజయంతో భారత్ ఆసియా గేమ్స్లో పతకం ఆశలు రేపుతోంది. ఎందుకంటే సెప్టెంబర్లో జరగనున్న ఆసియా క్రీడల్లో సెపక్ టక్రా గేమ్ ఉండడమే దీనికి కారణం. ప్రతిష్టాత్మ ఆసియా క్రీడల్లో సెపక్ టక్రాలో భారత్ పతకం సాధించాలని ఆశిద్దాం. ఏమిటీ సెపక్ టక్రా? సెపక్ టక్రా లేదా సెపక్ట క్రా అనేది ఆగ్నేయాసియాకు చెందిన ప్రసిద్ధ క్రీడ. దీనిని బ్యాడ్మింటన్ కోర్టును పోలిన కోర్టులో ఇరు జట్ల నుంచి రెండు నుంచి నలుగురు ఆటగాళ్లు ఆడడం జరుగుతుంది. ఇక మ్యాచ్లో బెత్తన్ లేదా ప్లాస్టిక్తో చేసిన బంతిని ఉపయోగిస్తారు. ఈ ఆటలో బంతిని తాకడానికి ప్లేయర్లు తమ పాదాలు, మోకాలు, భుజాలు, ఛాతీ, తలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే సెపక్ టక్రా గేమ్ వాలీబాల్, ఫుట్బాల్ను పోలి ఉంటుంది. సెపక్ టక్రాను మలేషియా జాతీయ క్రీడగా పరిగణిస్తారు. అయితే ఇదే క్రీడను పలు దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. మలేషియాలో సెపక్ టక్రా, ఇండోనేషియాలో సెపక్ రాగా, థాయ్లాండ్లో టక్రా, మయన్మార్లో చిన్లోన్, ఫిలిప్పీన్స్లో సిపా, లావోస్లో లతావ్, కంబోడియాలో సెక్ డై, వియత్నాంలో కౌ మే వంటి పేర్లతో పిలుస్తుంటారు. పేర్లు ఏదైనా ఆట మాత్రం అన్నింటిలో అదే విధంగా ఉంటుంది. ఇక 1965లో కౌలలంపూర్లో జరిగిన