
ఇంటర్నెట్ డెస్క్: ఇరాక్లోని కుర్దిస్థాన్(Kurdistan) ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాని మస్రూర్ బర్జానీ (PM Barzani) కార్యాలయంపై సోమవారం రాత్రి డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడులకు ఇరానే కారణమని కుర్దిస్థాన్ భద్రతా సంస్థ ఆరోపించింది. ప్రధాని కార్యాలయంతో పాటు కుర్దిస్థాన్ భద్రత, నిఘా సంస్థ ‘పరాస్తిన్’ అధిపతి నివాసాన్ని కూడా డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. కీలక ప్రభుత్వ, భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమని తెలిపింది. కుర్దిస్థాన్ ప్రధాని మస్రూర్ బర్జానీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, చట్టవిరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఈ తరహా చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కుర్దిస్థాన్ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ చేసిన తీవ్రమైన చర్య అని ఆరోపించారు. కుర్దిస్థాన్ ఆరోపణలను ఇరాన్(iran) ఖండించింది. ఈ దాడులు తాము చేయలేదని స్పష్టం చేసింది. ఇరాన్పై నిందలు మోపేందుకు ఇతర శక్తులు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) అనుమానం వ్యక్తం చేశారు. ఇరాక్(Iraq)లోని కుర్దిస్థాన్ ప్రాంతం ఇరాన్కు సమీపంలో ఉండటంతో గత కొంతకాలంగా ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలు, బలగాలకు కుర్దిస్థాన్లో స్థావరాలు ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజా ఘటనతో కుర్దిస్థాన్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ
