
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విగ్రహాల రగడ తీవ్ర దుమారం రేపుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో రాత్రి వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొలగించారు. ఈ క్రమంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏకంగా 1,500 మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల పరిసరాలు, పాకాల రోడ్డు వైపు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. విగ్రహ తొలగింపు ప్రక్రియను అత్యంత గోప్యంగా నిర్వహించారు. విగ్రహంతో పాటు దాన్ని ప్రతిష్ఠించిన సిమెంటు గద్దెను కూడా కూల్చివేసి, ఆ వ్యర్థాలను అక్కడి నుంచి దూరంగా తరలించారు. ఈ ఆపరేషన్ ఎంత సీక్రెట్గా జరిగిందంటే.. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని సైతం సెల్ ఫోన్లు ఉపయోగించవద్దని ఉన్నతాధికారులు కఠిన ఆంక్షలు విధించారని సమాచారం. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులను దారిలోనే అడ్డుకున్నారు. విగ్రహ తొలగింపు వార్త బయటకు రావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నర్సంపేటకు తరలివచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సంపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో కీలక బీఆర్ఎస్ నేతలను ఇళ్లలోనే అదుపులోకి తీసుకున్నారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం వద్ద సుమారు 400 మంది పోలీసులతో పహారా కాశారు. కాగా, నల్లబెల్లిలోని స్వగృహంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ముందు ఆయన సతీమణి పెద్ది స్వప్న భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. జులై 31న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఆయన దశ దిన కర్మ సందర్భంగా నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదుట