
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. ! ఇటీవల అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దివంగత నాయకుని కుటుంబసభ్యులను ప్రత్యక్షంగా కలిసి పరామర్శించారు. పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సుదర్శన్రెడ్డి తల్లి, భార్య, పిల్లలతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని వారికి కొండంత భరోసా ఇచ్చారు. కేసీఆర్ రాకతో నల్లబెల్లి ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం కనిపించగా, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ అధినేతను చూసేందుకు కార్యకర్తలు మరియు నాయకులు ఒక్కసారిగా ముందుకు రావడంతో నివాసం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడి స్వల్ప తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితులను చక్కదిద్ది కేసీఆర్ కాన్వాయ్ను సురక్షితంగా లోపలికి పంపించారు. దివంగత సుదర్శన్రెడ్డి కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ. 2.25 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సుదర్శన్రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చెరో కోటి రూపాయలు, అలాగే ఆయన తల్లి అమృతమ్మ సంరక్షణ నిమిత్తం మరొక రూ. 25 లక్షలను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకునిగా సుదర్శన్రెడ్డికి మంచి పేరుంది. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని, నమ్ముకున్న నేతను కోల్పోవడం వల్ల స్థానిక కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొందని పలువురు గులాబీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, ఇతర సంక్షేమ బాధ్యతలను నిరంతరం పర్యవేక్షిస్తామని బీఆర్ఎస్
