
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్ పంటల పెట్టుబడి కోసం రైతుభరోసా సాయం శుక్రవారం నాటితో సంపూర్ణం కానుంది. గత నెల 30న హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా తొలివిడత సాయం ఆరంభమైంది. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే 8 ఎకరాల వరకు సాయం విడుదల కాగా శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాదసభలో సీఎం తుదివిడత రూ.1009 కోట్లు విడుదల చేయనున్నారు. దీంతో కలిపి మొత్తం సాయం రూ.8759 కోట్లకు చేరుతుంది. తొలిరోజు రెండెకరాల వరకు రూ.878 కోట్లు విడుదల కాగా తర్వాత 3, 4, 5, 6, 7 ఎకరాల వరకు సాయం అందించారు. బుధవారం వరకు మొత్తం రూ.7750.45 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో 1.45 కోట్ల ఎకరాల మేరకు భూములు గల 74 లక్షల మంది రైతులకు సాయం చేరింది. ఇవిగాక కొత్తగా నమోదయ్యే వారికి, సాంకేతిక కారణాలతో సాయం నిలిచిన వారికి సైతం తర్వాత నిధులు విడుదల చేస్తారు. మొత్తంగా రూ.9 వేల కోట్ల సాయం రైతుభరోసా కింద చేరుతుందని అధికారవర్గాలు తెలిపాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు