
1947, ఆగస్టు 15న భారత్కు ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ లభించింది. శతాబ్దాల నిరీక్షణ ఫలించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల్లో తేలిపోయారు. పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. అయితే, భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ ఆ చరిత్రాత్మక రోజున ఏం చేస్తున్నారు? వేడుకల్లో పాల్గొన్నారా? లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతుంది. నిజానికి, ఆ రోజున గాంధీజీ చేసిన పనుల గురించి చాలామందికి తెలిసింది చాలా తక్కువ. గాంధీ హెరిటేజ్ పోర్టల్ లోని వివరాల ప్రకారం ఆ రోజు ఆయన ఏం చేశారో పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతదేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మహాత్మా గాంధీ రాజధాని ఢిల్లీలో లేరు. ఆయన ఆ సమయంలో కలకత్తా లో ఉన్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, దేశానికి స్వేచ్ఛ వచ్చిన ఆ శుభదినాన గాంధీజీ ఎలాంటి పెద్ద వేడుకలు జరుపుకోలేదు. కనీసం స్వాతంత్య్ర ఉత్సవాల గురించి ఉపన్యాసం కూడా ఇవ్వలేదు. ఆయన ఆ రోజంతా ఉపవాసం, ప్రార్థనలు, ప్రజలను కలవడానికే కేటాయించారు. గాంధీ హెరిటేజ్ పోర్టల్ సమాచారం ప్రకారం.. ఆగస్టు 15, 1947న ఆయన పూర్తిగా ప్రార్థనలు, ఉపవాసంలో గడిపారు. ఒకవైపు స్వాతంత్య్రం వస్తుందన్న ఆనందం ఉన్నప్పటికీ, మరోవైపు దేశం రెండు ముక్కలుగా విడిపోతోంది. నాటి విభజన కారణంగా అనేక ప్రాంతాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘోరమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో గాంధీజీ ఢిల్లీలో సంబరాలు చేసుకోకుండా, కలకత్తాలోనే ఉండి శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆగస్టు 13 నుంచే ఆయన కలకత్తాలోని బెలియాఘాటా ప్రాంతంలో ఉన్న 'హైదరీ మ్యాన్షన్'లో బస చేశారు. మతపరమైన అల్లర్ల మధ్య హిందూ-ముస్లింల మధ్య ఐక్యత, శాంతిని నెలకొల్పడానికే ఆయన అక్కడ ఉన్నారు. ఆగస్టు 14 సాయంత్రం జరిగిన ప్రార్థనా సమావేశంలోనే గాంధీజీ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 15న తాను 24 గంటల