
చెన్నై (రెడ్హిల్స్): నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని కుమారుడు హత్య చేశాడు. ఈ దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరువళ్లూర్ జిల్లా తిరువేలాంగాడు సమీపంలోని మనవూరుకు చెందిన శేషాద్రి కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి. ఆయనకు భార్య పద్మావతి (75), ముగ్గురు కుమారులున్నారు. అందరికీ వివాహమైంది. కొన్నేళ్ల క్రితం శేషాద్రి మృతి చెందారు. పద్మావతికి పింఛన్ రూ.45వేలు అందేది. వయసు మీద పడడంతో ఆమె నడవలేక ఇబ్బందిపడేవారు. ఆమె బాగోగులు చూసుకోవడంపై అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. మూడో కుమారుడు పార్థసారథి తల్లి సంరక్షణ బాధ్యతలకు ముందుకురాగా ఆయన భార్య, అత్త అంగీకరించలేదు. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడంతో పార్థసారథి భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన పార్థసారథి మంగళవారం రాత్రి తల్లిని వీల్ఛైర్లో కూర్చోబెట్టి మనవూరు రైల్వేస్టేషన్కు చేరుకుని తిరుత్తణి నుంచి అరక్కోణం వైపు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు కింద తోసేసి వెళ్లిపోయాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఘటనాస్థలి వద్ద నుజ్జునుజ్జయిన వీల్ఛైర్ను గుర్తించారు. అనుమానంతో కడంబత్తూరు పోలీసులు పార్థసారథిని అదుపులోకి తీసుకోగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు