
థియేటర్లు, ఓటీటీల్లో దివ్యాంగులకు ఆడియో డిస్క్రిప్షన్, సబ్టైటిల్స్, క్యాప్షనింగ్, సైగ భాష వంటి సౌకర్యాలు కల్పించేలా ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. థియేటర్లలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించేలా. చర్యలు చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది. థియేటర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ (OTT Platforms) లలో విడుదలయ్యే సినిమాల్లో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేలా, రెండు వారాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు), మైత్రి మూవీ మేకర్స్ సహా ఇతర భాగస్వామ్యులంతా చర్చించి, అమలు చేయదగ్గ నిర్ణయాన్ని తీసుకోవడం కోసం వారంలోగా ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. థియేటర్లలో, ఓటీటీల్లో.. ఆడియో డిస్క్రిప్షన్, సబ్ టైటిల్స్, క్యాప్షనింగ్, సైగ భాష వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని కోరుతూ పుష్ప 2 (Pushpa 2) సినిమా విడుదల సమయంలో దివ్యాంగ హక్కుల కార్యకర్త, న్యాయవాది రాహుల్ బజాజ్ (Rahul Bajaj) ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అది కేవలం 'పుష్ప 2' సినిమాకి మాత్రమే పరిమితం కాదని, దివ్యాంగుల సినిమా వీక్షణ సౌలభ్యానికి సంబంధించిందని పేర్కొన్నారు