
సిరి ఉంటేనే కరి కట్టడి ఏటా తప్పని తిప్పలు పలమనేరు, న్యూస్టుడే: ప్రభుత్వం ఏనుగుల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి దాడులు మాత్రం ఆగడం లేదు. జిల్లాలో వాటి దాడుల్లో వందల ఎకరాల్లో పంటలు ధ్వంసమవుతున్నాయి. పదేళ్లలో ఏనుగుల దాడుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 15 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఏనుగుల గుంపు ఎక్కడ ఉంది.. ఎంత దూరంలో ఉంది.. ఎన్ని ఉన్నాయి అనే స్పష్టమైన వివరాల కోసం అటవీశాఖ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కృత్రిమమేథ, రిమోట్ ఫెన్సింగ్, రేడియో కాలర్, జియో స్పేషియల్ మ్యాపింగ్తో ఎప్పటికప్పుడు ఏనుగులను గుర్తిస్తూ జనావాసాల్లోకి రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దేశంలో మొత్తం 33 ఏనుగుల అభయారణ్యాలతోపాటు 150 కారిడార్లు ఉన్నాయి. అందులో చిత్తూరు జిల్లాలో పలమనేరు, కుప్పం, చిత్తూరు ఓ కారిడార్ కాగా, శ్రీవేంకటేశ్వర అభయారణ్యం రెండో కారిడార్గా గుర్తించారు. వీటిని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఎలిఫెంట్ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.500 కోట్లు ఇందుకు కేటాయించారు. పథకం కింద కేంద్రం ఆయా రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుంది. అయితే మన జిల్లాకు ఇంకా ఈ నిధులు విడుదల కాలేదు. నిధులు విడుదలైతే సోలార్ ఫెన్సింగ్, కందకాలు తవ్వడం తదితర పనులు చేపట్టే వీలుంటుంది. ఏనుగుల కదలికలను గుర్తించేందుకు డ్రోన్లు అధికారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. డ్రోన్ ఎగరేసి ఒంటరి ఏనుగులను గుర్తించి తర్వాత కుంకీల సాయంతో వాటిని పట్టుకుంటున్నారు. తదనంతరం వాటికి శిక్షణ ఇచ్చి కుంకీలుగా మారుస్తున్నారు. ఇటీవల పలమనేరులో ఈ ప్రాజెక్టు విజయవంతమైంది. ప్రస్తుతం ఒంటరి ఏనుగులు ఎక్కువగా సదుం, బంగారుపాళ్యం, సోమల, కల్లూరు, టేకుమంద ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఇక కుప్పం, రామకుప్పం, వి.కోట మండలాల్లోనూ ఉన్నాయి. తిరుపతి జిల్లాలో భాకరాపేట, చంద్రగిరి పరిసరాల్లోనూ సంచరిస్తున్నాయి. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించడానికి వాటి మెడకు రేడియో కాలర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది