
సూర్యతో కలిసి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో నటించిన మమిత బైజు తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో మమిత బైజు (Mamitha Baiju) ఒకరు. మలయాళ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య (Suriya)తో కలిసి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’(Viswanath And Sons) లో నటించారు. ఈ సినిమాలో సూర్యతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మమిత బైజు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సెట్లో మమిత ఉంటే వాతావరణమే మారిపోతుందని,. ఆమెను కెమెరా ఎంతో ఇష్టపడుతుందని సూర్య ప్రశంసించి మాటలు ట్రేండ్ అవుతున్నాయి. ఇదే సందర్భంలో సూర్యతో తనకున్న పాత జ్ఞాపకాన్ని మమిత గుర్తు చేసుకున్నారు. తాను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో సూర్య కొచ్చిలో జరిగిన ఓ మాల్ ఈవెంట్కు వచ్చారని చెప్పారు. తన అన్నయ్య అతడి స్నేహితుడితో కలిసి ఆ కార్యక్రమానికి వెళ్లి సూర్యతో ఫొటో దిగాడని తెలిపారు. అయితే, ఆ సమయంలో తనకు సూర్యను కలిసే అవకాశం రాలేదని మమిత చెప్పారు. చిన్నతనంలో అభిమానించే హీరోతో ఇప్పుడు కలిసి నటించే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. సూర్యతో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ మమిత చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు సైతం ఆమె కథపై ఆసక్తిగా స్పందిస్తున్నారు