
అద్భుత చిత్రాలు రూపొందిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న యువతి రాయగడ పట్టణం, న్యూస్టుడే: ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువు సంపాదించుకుంది. ఉద్యోగంతో ఆమె కెరీర్ సజావుగా కొనసాగుతోంది. అయినప్పటికీ ఏదో వెలితి ఆమెను నిరంతరం వెంటాడుతుండేది. దీంతో చిన్ననాటి నుంచి ఎంతో ఇష్టపడే చిత్రలేఖనం వైపు మనసు మళ్లింది. కుంచెకు పదును పెడుతూ అద్భుతమైన చిత్రాలు రూపొందిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇందుకోసం తనకు దక్కిన, ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఉద్యోగాన్ని వదులుకుంది. కేంద్రపడ జిల్లాకు చెందిన మధుస్నతదాస్ ప్రస్తుతం భువనేశ్వర్లో నివాసముంటోంది. చిన్నతనం నుంచి చదువులో చురుకుగా ఉండే ఆమె కేంద్రపడ స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఇండస్ట్రియల్ సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత బ్రహ్మపుర విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ పూర్తయింది. డిగ్రీలో టాపర్గా నిలిచిన మధుస్నత యూజీసీ-ఎన్ఈటీ పరీక్షలకు రెండుసార్లు అర్హత సాధించింది. అనంతరం పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్(పీఎస్యూ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కొలువు దక్కించుకుంది. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే, సామాజిక మాధ్యమాల ద్వారా మెలకువలు, గంటలకొద్దీ సాధనతో ఆమె నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. అలా ఆమె కుంచె నుంచి సాయిబాబా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్, మహాత్మాగాందీ తదితర చిత్రాలు జాలువారాయి. ఇటీవల మధుస్నత రూపొందించిన జగన్నాథుని పెయింటింగ్తో వేలాది మంది హృదయాలు గెలుచుకుంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా సమయం కుదురకపోవడంతో కొలువుకు స్వస్తి పలికినట్లు చెప్పారు. ఇందుకు కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందన్నారు. మొదటిసారి ఓ పెయింటింగ్ ఆర్డరును ఒప్పుకున్న తన తొలి సంపాదన రూ.2,100 అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. కొంతమంది పెయింటింగ్స్ కోసం ఆర్డరు పెట్టి ఎలాంటి రుసుం చెల్లించడం లేదన్నారు. మరికొందరు చిత్రాలు పూర్తయినప్పటికీ, వాటిని తీసుకెళ్లేందుకు రాకపోవడం నష్టాలు చవిచూడాల్సి వస్తోందన్నారు. అయినప్పటికీ చిత్రలేఖనంపై మమకారం పోదని, తన పెయింటింగ్స్ చిరకాలం గుర్తుండిపోయేలా