
కొలంబియా దేశంలో సోమవారం ఉదయం ఒక పెద్ద విషాదం జరిగింది. పశ్చిమ కొలంబియా ప్రాంతాన్ని 7.4 తీవ్రతతో భారీ భూకంపం తీవ్రంగా కుదిపేసింది. దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం 132 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడ్డారు. వీరిలో 570 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని కొలంబియన్ అసోసియేషన్ ఆఫ్ క్యాపిటల్ సిటీస్ ఈ అధికారిక లెక్కలను వెల్లడించింది. భూకంపం ధాటికి అనేక భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఇంకా అనేకమంది చిక్కుకుపోయారు. వారిని కాపాడటానికి రెస్క్యూ టీమ్లు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకున్న ప్రభుత్వం దేశంలో నేషనల్ డిజాస్టర్ ప్రకటించింది. ఆర్మీ సైనికులను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేసింది. ఈ భారీ భూకంప కేంద్రం పశ్చిమ కొలంబియాలోని శాన్ జోసే డెల్ పాల్మర్ ప్రాంతంలో ఉంది. ఇది రాజధాని బొగోటాకు దాదాపు 150 మైళ్ల దూరంలో ఉండే ఒక వెనుకబడిన ప్రాంతం. అయితే, దీని ప్రభావం రాజధాని బొగోటాలో కూడా చాలా తీవ్రంగా కనిపించింది. పెద్ద శబ్దంతో సైరన్లు మోగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల దేశంలో 5 ప్రధాన నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా దాదాపు 86 భారీ భవనాలు పూర్తిగా కూలిపోయాయి. అంతేకాకుండా, భద్రతా కారణాల వల్ల 7 విమానాశ్రయాల్లో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసారు. 20కి పైగా మున్సిపాలిటీలపై ఈ ప్రభావం పడింది. పొరుగున ఉన్న ఈక్వెడార్, పనామా దేశాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపంలో కాలి అనే నగరంలో ఒక ప్రధాన ఆసుపత్రికి చెందిన పిల్లల, నవజాత శిశువుల వార్డులు ఉన్న భవనం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు