
ఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులను అలరించడం కోసం నటీనటులు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. ప్రస్తుతం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో చిరంజీవి హీరోగా రానున్న మెగా 158 ఒకటైతే.. రష్మిక ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న ‘మైసా’ మరొకటి. ఈ చిత్రాల కోసం అటు చిరు.. ఇటు రష్మిక ఎంతో కష్టపడుతున్నారు. తాజాగా ఈ రెండు సినిమాల అప్డేట్స్ను ఆయా చిత్రబృందాలు పంచుకున్నాయి. మెగా 158లో వర్షంలో సీక్వెన్స్ కోసం చిరంజీవి 12 గంటలు ఏకధాటిగా షూటింగ్ చేయగా.. ‘మైసా’ (Mysaa) కోసం రష్మిక అండర్ వాటర్ సీక్వెన్స్ను పూర్తి చేశారు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో #Mega158 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఓ భారీ సెట్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘ఉదయం 4 గంటలకు వ్యాయామంతో తన రోజును ప్రారంభించే చిరంజీవి నిబద్ధత చూసి మా చిత్రబృందం ఆశ్చర్యపోయింది. అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయడం కోసం 12 గంటలు పట్టింది. వర్షంలో ఉండే ఈ సన్నివేశాన్ని చిరు ఎంతో కష్టపడి పూర్తి చేశారు. అందుకే ఆయన మెగాస్టార్ (Chiranjeevi) అయ్యారు’’ అని టీమ్ పోస్ట్ చేసింది. ‘మైసా’ కోసం మునుపెన్నడూ లేనివిధంగా రష్మిక (rashmika) శ్రమిస్తున్నారని దర్శకుడు రవీంద్ర పుల్లె తెలిపిన విషయం తెలిసిందే. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆమె.. గోండు తెగకు చెందిన మహిళగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం సవాలుతో కూడిన స్టంట్స్ చేసిన నటి.. తాజాగా అండర్ వాటర్ సీక్వెన్స్ను పూర్తి చేశారు. సినిమాలో ఈ సన్నివేశం చాలా ఆసక్తిగా ఉంటుందని టీమ్ వెల్లడించింది (Mysaa Update). ఈ చిత్రం కోసం అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ ఆధ్వర్యంలో రష్మిక శిక్షణ పొందారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి