
‘అగధ’ టీజర్, ట్రైలర్ చూసిన మహేశ్ బాబు ‘ఈసారి కొడుతున్నారు సార్’ అని మెసేజ్ చేశారని దర్శకుడు ఎం.ఎస్. రాజు తెలిపారు. ప్రభాస్ కూడా ‘కొడుతున్నావ్ బావ’ అన్నారని చెప్పారు. సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు (MS Raju) తెరకెక్కించిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’(Agadha)పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్కుమార్, భానుచందర్, షిజు, వనిత విజయ్కుమార్, రోషన్ బషీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎం.ఎస్. రాజు మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘అగధ’ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అనే అర్థం వస్తుందని ఎం.ఎస్. రాజు తెలిపారు. దేవుడిని, దుష్టశక్తులను మనం కళ్లతో చూడలేమని, అలాంటి శక్తుల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ అని చెప్పారు. ‘ప్రస్తుతం సినిమాకు ఓపెనింగ్స్ తీసుకొచ్చేది యూత్, మాస్ ఆడియెన్స్. ఆ తర్వాత మౌత్ టాక్తో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వస్తారు. ‘అగధ’లో కేవలం హారర్, భయపెట్టే అంశాలు మాత్రమే ఉండవు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయి’ అని దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే ఓ దుష్టశక్తిని ‘అగధ’లో చూపించినట్లు ఆయన చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేసినట్లు ఎం.ఎస్. రాజు తెలిపారు. పలు ప్రాంతాల్లో తిరిగి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. తాను చూసిన వాస్తవ సంఘటనలకు తన ఫాంటసీని జోడించి మంచి సినిమాటిక్ అనుభూతిని అందించేలా ‘అగధ’ను తెరకెక్కించినట్లు వివరించారు. ‘ఇదొక ఆర్ట్ ఫిల్మ్లా కాకుండా అందరినీ రంజింపజేసేలా రూపొందించాను. సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులతో పాటు మల్టీప్లెక్స్ ఆడియెన్స్ను కూడా ఆకట్టుకోవాలనుకున్నాను. ఈ చిత్రాన్ని ఎంతో నిజాయితీతో తెరకెక్కించాను’ అని అన్నారు. ‘అగధ’పై తనకు చాలా నమ్మకం ఉందని ఎం.ఎస్. రాజు చెప్పారు