
ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు, షట్లర్ పుల్లెల గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రీడా రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వీరిద్దరూ తెలంగాణతో పాటు దేశానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు."క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభతో అర్జున అవార్డులకు ఎంపికైన గాయత్రి, ధనుష్ తెలంగాణకు గర్వకారణం" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీరితో పాటు 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలు గెలుచుకున్న విజేతలందరికీ ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు.క్రీడా రంగంలో వారు చూపిన పట్టుదల, నిబద్ధత, కఠోర శ్రమ యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించి, మరెన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు