
ఈనాడు-ఏలూరు: డిజిటల్ అరెస్టుల గురించి వింటున్నాం. లింకులు పంపి బ్యాంకుల్లో దాచుకున్న మొత్తాన్ని కొల్లగొడుతున్న ముఠాలను చూస్తున్నాం. తాజాగా.. జిల్లాలో అనిశా అధికారుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీని వెనుక ఇంటి దొంగలున్నారా అనే అనుమానాలొస్తున్నాయి. ఈ నెల 10న ఏలూరు నగరపాలక కార్యనిర్వాహక ఇంజినీర్ (ఈఈ) సురేంద్రబాబుకు ఏసీబీ డీఎస్పీ పేరుతో అనధికార వ్యక్తి ఒకరు ఫోన్ చేసి మీపై ఫిర్యాదు అందింది. దీనిపై ఉన్నతాధికారులు తక్షణ నివేదిక కోరారు. మీకు అనుకూలంగా రాసి పంపుతాను. అందుకు కొంచెం ఇవ్వాలని చెప్పగా, ఈఈ రూ.లక్ష ఫోన్పే చేశారు. తీరా.. మోసపోయానని గ్రహించి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ వసూళ్ల వ్యవహారం ఏమిటి? అనిశా పేరు ఎందుకు వాడారు? అది ఎవరి పని? ఏమిటనేది మిస్టరీగా మారింది. గతంలోనూ ఇలా ఇంకెవరి నుంచైనా తీసుకున్నారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాలి. మరో వైపు ఈఈ కన్నా ముందు సూపరింటెండెంట్ సిరాజ్కు ఫోన్ చేశారు. ఈఈని కాన్ఫరెన్స్లోకి తీసుకుని తనతో మాట్లాడించాలని కోరారు. ఆ మేరకు కాన్ఫరెన్స్లోకి తీసుకోగా.. ఇలా వద్దు తానే నేరుగా సురేంద్రబాబుతో మాట్లాడతానని కాల్ కట్ చేయడం అనుమానాలకు దారితీస్తోంది. అనిశా అధికారులు ఎప్పుడూ ట్రాప్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసేటప్పుడు ఎవరికీ ఫోన్ చేయరు. అనుకూల నివేదికలు ఇస్తామని చెప్పరు. ఆ విషయం అధికారులకూ తెలుసు. అయినా ఈఈ ఎందుకు భయపడ్డారు.. అనిశా అనగానే అడిగిన మొత్తం ఇవ్వడం విచిత్రంగా ఉంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా