
శ్రీసిటీలో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి సియోల్ (సౌత్ కొరియా): హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషి (Yokota Takeshi) తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లోని హ్యోసంగ్ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రూ.8వేల కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ నెట్ వర్క్ కలిగి ఉందని చెప్పారు. 2034నాటికి 15గిగావాట్ల ట్రాన్స్ మిషన్ రోడ్ మ్యాప్ తో, 160 GW క్లీన్ ఎనర్జీ సాధన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. 7,248 MW కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, వీటన్నింటికీ భారీ స్థాయిలో 765/800 kV ట్రాన్స్ఫార్మర్లు, GIS, STATCOM పరికరాలు అవసరం అవుతాయన్నారు. వీటితోపాటు రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ నేపథ్యంలో, విద్యుత్ పరికరాలకు భారీ డిమాండ్ ఉందన్నారు. తిరుపతి లేదా శ్రీసిటీ సమీపంలో స్విచ్గేర్లు, ఇతర విద్యుత్ పరికరాలు తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తిచేశారు. హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషి మాట్లాడుతూ... Hyosung T&D India Pvt Ltd (పూణే, ఖేడ్ సిటీ) 2006 నుండి భారత్ లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది చెప్పారు. భారతదేశంలో 66–800 kV GIS పరికరాలను తయారు చేసే ఏకైక సంస్థ హ్యోసంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని యోకోటా తకేషి చెప్పారు