
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Hormuz)లో కొత్త టోల్ విధానాన్ని అమలు చేయడానికి ఇరాన్ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ (Iran Ambassador Abdolreza Rahmani) కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ తమ ప్రాదేశిక జలాల్లో భాగంగా ఉన్నందున.. జలసంధిలో సేవా రుసుం వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఇవి టోల్ కిందకు రావన్నారు. ఈ విషయంపై ఒమన్తో చర్చలు జరుపుతున్నామన్నారు. కష్టసమయంలో తమకు సహకారం అందించిన మిత్ర దేశాలకు సేవా రుసుం విషయంలో ప్రత్యేక ప్రాధాన్యాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హర్మూజ్లో ప్రయాణ భద్రతకు హామీ ఇవ్వడం, నౌకల రాకపోకలను పర్యవేక్షించడం, భారీ సంఖ్యలో నౌకల వల్ల కలిగే పర్యావరణ పరిణామాలను ఎదుర్కోవడం వంటివాటిని ఒమన్ (Oman) సహకారంతో ఇకపై తాము పర్యవేక్షిస్తామని అబ్దుల్ రెజా వెల్లడించారు. కాగా హర్మూజ్లో విధించే సేవా రుసుంపై మిత్రదేశాలకు ప్రత్యేక రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హర్మూజ్ (Hormuz) భద్రతను ఇకపై ఒమన్తో కలసి తాము చూసుకుంటామని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబాది పేర్కొన్నారు. ఇతర దేశాలు సైనిక విన్యాసాలు చేపట్టడానికి ఈ జలసంధి రంగస్థలం కాదని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ నిర్దేశించిన మార్గంలో కాకుండా.. ఒమన్ తీరం వెంబడి ప్రయాణించడానికి ప్రయత్నించిన ఎనిమిది నౌకలను అక్కడి అధికారులు వెనక్కి పంపినట్లు షిప్పింగ్ డేటా నివేదికలు వెల్లడించాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు