
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత ప్రయాణం ముగిసింది. సువర్ణాధ్యాయానికి తెరపడింది. దశాబ్దాల పాటు తన మధురమైన స్వరంతో యావత్ దేశాన్ని మంత్రముగ్ధులను చేసిన గానకోకిల ఎస్ జానకి శనివారం కన్నుమూశారు. మైసూర్ లోని తన నివాసంలో 88 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త.. సంగీత ప్రపంచాన్ని కలచివేసింది. యావత్ సినీ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆమెకు కన్నీటి నివాళి అర్పిస్తోంది. ఎస్ జానకి అందించిన విశిష్ట సేవలకు గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. మైసూరులోని మహారాజా కాలేజీ మైదానంలో ఆమె పార్థివదేహాన్ని అభిమానుల కడసారి సందర్శనార్థం ఉంచారు. కడసారి చూపు కోసం లక్షలాదిమంది అభిమానులు మైసూరుకు తరలివస్తోన్నారు. కన్నీటి నివాళి అర్పిస్తోన్నారు. అంత్యక్రియలను మైసూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డాక్టర్ ఎస్ యతీంద్ర పర్యవేక్షిస్తోన్నారు. జానకమ్మకు వీడ్కోలు పలికేందుకు ప్రతీ ఒక్కరికీ అవకాశం కల్పిస్తూ ఏర్పాట్లు చేశారు. ఆమె అంత్యక్రియలు మైసూరు సమీపంలోని కణియనహుండి గ్రామంలో జరుగనున్నాయి. జానకమ్మ తన శేష జీవితాన్ని ఇక్కడే గడపారు. ఇందుకోసం ఆమె స్వయంగా అక్కడ రెండెకరాలను కూడా కొనుగోలు చేశారు. ఇక్కడ ఇళ్లు కట్టుకోవాలని ఆశించారు. ఆమె కోరిక మేరకే అదే ఇంటి స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంత్యక్రియల సమయంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు సుమారు 200 మంది పోలీసు సిబ్బందిని, రెండు కేఎస్ఆర్పీ బలగాలను నియమించినట్లు మైసూరు జిల్లా ఎస్పీ మల్లికార్జున బలదండి స్పష్టం చేశారు. పార్థివదేహాన్ని దర్శించుకోవడానికి వచ్చే వీఐపీల వాహనాల, సాధారణ ప్రజల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేకంగా ట్రాఫిక్ రూట్ మ్యాప్లను సిద్ధం చేశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఎస్ జానకి అద్భుత సంగీత ప్రస్థానంలో 20కి పైగా భారతీయ భాషల్లో 48,000 కంటే ఎక్కువ గీతాలను ఆలపించి చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా తెలుగు