
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల హాజరుపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభకు హాజరుకాకుండా, కేవలం రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తున్న ఎమ్మెల్యేలను నియంత్రించేందుకు ప్రతి సభ్యుడి సీటు వద్ద కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చుంటేనే సభకు హాజరైనట్లుగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారం కనుగొంటారనే నమ్మకంతో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని ఆయన పేర్కొన్నారు. అయితే, కొందరు సభ్యులు సభకు హాజరుకాకుండానే జీతభత్యాలు తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సభ్యుల హాజరు విషయంలో పారదర్శకత కోసమే ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.ఇదే సందర్భంగా పలు ఇతర అంశాలపై ఆయన స్పందించారు. డీఎస్సీ అంశాన్ని అనవసరంగా వివాదాస్పదం చేయవద్దని సూచించారు. క్రీడా కోటా నియామకాలపై వాస్తవాలు తెలుసుకోవాలంటే తొలుత రికార్డులను పరిశీలించాలని, ఆ తర్వాతే మాట్లాడాలని హితవు పలికారు. రానున్న శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 17న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు