
ఇంటర్నెట్ డెస్క్: కరూర్ తొక్కిసలాట (Karur stampede) నేపథ్యంలో డీఎంకే (DMK) వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) జూలై 10న కరూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలతో మాట్లాడకుండా.. బహిరంగ ప్రకటనలు చేయకుండా విజయ్ను నిరోధించాలని డీఎంకే విజ్ఞప్తి చేయడాన్ని తప్పుబట్టింది. సీఎం పర్యటనలను తాము నియంత్రించాలా..? అని జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని.. ఆ స్వేచ్ఛపై ఆంక్షలు విధించాలా..? అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది. కరూర్ తొక్కిసలాట విషయంలో స్వయంగా సీబీఐ విచారణకు ఆదేశించిన తామే ఒక రాజకీయ ప్రత్యర్థి పిటిషన్ను ఎలా అంగీకరిస్తామని సుప్రీం కోర్టు (Supreme Court) పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దని హెచ్చరించింది. ఈ ఘటనలో విజయ్ కూడా నిందితుడే అని డీఎంకే తరఫు న్యాయవాది వాదించారు. కాగా ఘటనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లలో విజయ్ని నిందితుడిగా పేర్కొనలేదని స్పష్టం చేస్తూ.. సుప్రీం కోర్టు పిటిషన్ను కొట్టేసింది. తమిళనాడు సీఎం విజయ్ జులై 10న కరూర్ పర్యటన (Vijay Karur visit)కు వెళ్లనున్నారు. మృతుల కుటుంబాలను కలిసి..వారికి కారుణ్య నియామకాలు, ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని ప్రతిపక్ష డీఎంకే సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు