
ప్రముఖ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తన కెరీర్లో మరో అరుదైన, ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత లా ట్రిబో యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ లెటర్స్) ప్రదానం చేసింది. భారతీయ సినిమాకు, సమాజ సేవకు ఆమె చేసిన మూడు దశాబ్దాల కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించింది. గతంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు ఇదే వర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వగా, ఇప్పుడు ఆ ఘనత సాధించిన రెండో భారతీయ సినీ వ్యక్తిగా రాణీ ముఖర్జీ నిలిచారు.మెల్బోర్న్లో జరుగుతున్న 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్' (ఐఎఫ్ఎఫ్ఎం) 2026 వేడుకల్లో భాగంగా ఫెడరేషన్ స్క్వేర్లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "లా ట్రిబో యూనివర్సిటీ నుంచి ఈ గౌరవ డాక్టరేట్ అందుకోవడం నా జీవితంలో అత్యంత వినమ్రపూర్వకమైన క్షణాలలో ఒకటి. చిన్నతనంలో నా కుటుంబాన్ని, నా దేశాన్ని గర్వపడేలా చేయాలని కలలు కన్నాను. దానిని సాధించడానికి సినిమా ఒక మాధ్యమంగా మారింది" అని ఆమె తన సంతోషాన్ని పంచుకున్నారు."నేను కెరీర్ ప్రారంభం నుంచే రిస్క్ తీసుకునేదాన్ని. నా హృదయాన్ని తాకిన కథలనే ఎంచుకున్నాను. స్ఫూర్తినిచ్చే, సాధికారతను పెంచే కథలను చెప్పాలనుకున్నాను. భారతీయ మహిళల శక్తిని నా సినిమాల ద్వారా నిశ్శబ్దంగా ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నించాను" అని రాణీ వివరించారు. ఈ గౌరవాన్ని కేవలం తన వ్యక్తిగత విజయంగా కాకుండా, యావత్ భారత దేశానికి దక్కిన పురస్కారంగా భావిస్తున్నట్లు తెలిపారు