
అమరావతి: విశాఖ కేంద్రంగా ఏఐ హబ్ దేశానికే తలమానికంగా రూపుదిద్దుకుంటుందని.. డేటా కేంద్రాల అనుమతుల విషయంలో ఎటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Lokesh) స్పష్టం చేశారు. డేటా సెంటర్లపై అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదని, దీన్ని కలిసికట్టుగా అందరూ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని స్పష్టం చేశారు. 6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీలతో నీటి వినియోగం మరింత తగ్గుతుందని తెలిపారు. డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు అందిస్తామని, విశాఖ నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. నగర అవసరాలకు పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్లైన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్తో పోలిస్తే డేటా సెంటర్ నీటి వినియోగం దాదాపు పదో వంతేనని మంత్రి వివరించారు. సీఎం చంద్రబాబు నిర్దేశించిన 6.5 గిగావాట్ల డేటా సెంటర్ కేటాయింపుల లక్ష్యం ఇప్పటికే పూర్తైందని, పర్యావరణ బాధ్యతతో పనిచేసే సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామని లోకేశ్ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు