
15 మంది దుర్మరణం మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు, పదిమంది తమిళులు, ఇద్దరు కేరళీయులు 250 మంది డిస్ట్రిబ్యూటర్లను విదేశీ టూరుకు తీసుకెళ్లిన సెల్ఫోన్ కంపెనీ సైట్ సీయింగ్కు మూడు బోట్లు.. 36 మందితో బయల్దేరిన బోటు మునక 21 మందిని రక్షించిన భద్రతా, నౌకా దళాలు న్యూఢిల్లీ, చెన్నై, అమరావతి జూలై 11(ఆంధ్రజ్యోతి): వియత్నాంలో భారతీయుల విహార యాత్ర పెను విషాదంగా ముగిసింది. అప్పటిదాకా పర్యాటక బోటులో సాగిన సరదాలను సంద్రం ముంచేసింది. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 15 మంది మరణించారు. 36 మంది ప్రయాణిస్తున్న బోటు తిరగబడి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రులు చనిపోగా, మరొకరు అపస్మారక స్థితిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన పదిమంది ప్రాణాలు కోల్పోయారు. కేరళకు చెందిన ఇద్దరు మృత్యువాతపడ్డారు. తక్కిన 21 మందిని భద్రతాసిబ్బంది ఒడ్డుకు చేర్చారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొబైల్ కంపెనీ టూర్ కోసం వెళ్లి ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ వ్యాపార పర్యటనలో భాగంగా భారత్ నుంచి సుమారు 250 మంది పర్యాటకులను వియత్నాం తీసుకెళ్లింది. ఆంధ్రానుంచి 35మంది, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డీలర్లు ఈ విహారయాత్రకు వెళ్లారు. శనివారం మూడు బోట్లలో పర్యాటకులు సైట్ సీయింగ్కు వెళ్లారు. 36 మంది ఓ బోటులో బయలుదేరారు. వారిలో 32 మంది పర్యాటకులు కాగా, నలుగురు సిబ్బంది ఉన్నారు. హాన్ మే రూట్ నుంచి అన్థోయ్ పోర్టుకు వెళ్లే సముద్రమార్గంలో వారంతా విహరిస్తుండగా, అకస్మాత్తుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అలల తీవ్రత చూస్తుండగానే పెరిగిపోయింది. కడలి కల్లోలంగా మారింది. 10.30 గంటల ప్రాంతంలో అన్థోయ్ పోర్టుకు 400 మీటర్ల దూరంలో బోటు తిరగబడి మునిగిపోయింది. బోటు నుంచి కొందరు దూకేశారు. మిగిలినవారు బోటుతోపాటే మునిగిపోయారు. వారిలో 15 మంది మరణించారు
