
Jharkhand Govt : జార్ఖండ్లో పరీక్షల అవకతవలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టీడీపీఎల్ సంస్థ 2014 నుంచి నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. అదే సమయంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (JSSC-CGL) పరీక్షలను కూడా రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం కఠినమైన చట్టం తీసుకొస్తామని హేమంత్ సోరెన్ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల ఆందోళనల నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర నియామక పరీక్షల వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. జార్ఖండ్ కేబినెట్ తీసుకున్న ఐదు కీలక నిర్ణయాలు ఇవే.. ♦ టీడీపీఎల్ సంస్థ 2014 నుంచి నిర్వహించిన అన్ని పరీక్షలను, వాటికి సంబంధించిన నియామక ప్రక్రియలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ♦ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) CGL పరీక్షలను కూడా రద్దు చేయనున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ♦ 2014 నుంచి ఇప్పటివరకు నియామక ప్రక్రియల్లో జరిగిన చిన్నదైనా, పెద్దదైనా ప్రతి తప్పిదంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జార్ఖండ్లో 2014 నుంచి నిర్వహించిన అన్ని నియామక పరీక్షలపై సీఐడీ దర్యాప్తు చేయనుంది. ♦ నియామక పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలను సూచించేందుకు ఐఏఎస్ అధికారి అమితాభ్ కౌశల్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే మార్గాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ♦ విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని హేమంత్ సోరెన్ తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు త్వరలో బలమైన చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు