
ఇంటర్నెట్ డెస్క్: హిందీలో సంచలన విజయం సాధించిన క్లాసిక్ చిత్రం ‘3 ఇడియట్స్’ (3 Idiots) తమిళ రీమేక్లో నటించే అవకాశాన్ని నటుడు ఆర్. మాధవన్ తిరస్కరించారు. ఇందుకు గల కారణాన్ని తాజాగా ఆయన వెల్లడించారు. దర్శకుడు శంకర్ చెప్పిన ఓ మాట తనను భయపెట్టిందని, అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగానని పేర్కొన్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని విజయ్ (Vijay) కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. ఒరిజినల్ చిత్రంలో ‘ఫర్హాన్’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన మాధవన్.. (R Madhavan) తమిళ రీమేక్లోనూ అదే పాత్ర కోసం మొదట ఎంపికయ్యారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్కు నో చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై మాధవన్ తాజాగా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో దర్శకుడు శంకర్ దీనిని ఒక ‘క్విక్కీ’ ప్రాజెక్ట్ (ట్రెండ్ను ఫాలో అవడం కోసం తక్కువ సమయంలో వేగంగా ముగించే చిత్రం) అని అభివర్ణించారట. శంకర్ నోటి వెంట ఆ మాట వినగానే తనకు ఒకరకమైన భయం వేసిందని మాధవన్ పేర్కొన్నారు. త్వరగా చిత్రాన్ని తెరకెక్కిస్తే.. ఒరిజినల్ మాదిరిగా రాదేమోనని అనిపించిందని చెప్పారు. పాత్రల్లోని భావోద్వేగాలను అమితంగా ఇష్టపడే మాధవన్.. ఆ ప్రాజెక్ట్కు సున్నితంగా నో చెప్పారట. విజయ్ లాంటి స్టార్ అందులో నటిస్తున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ గురించి ఆలోచించకుండా.. తన పాత్ర ప్రాముఖ్యతను కాపాడటానికే మొగ్గు చూపినట్లు తెలిపారు. ఇక ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect)తో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చిన మాధవన్ (R Madhavan) ఇప్పుడు మరో బయోపిక్తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ‘ది ఎడిసన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన జి.డి.నాయుడు (G D Naidu) బయోపిక్లో ఆయన టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి